వీరి వీరి గుమ్మడి పండు

Monday, November 18, 2013

ఆల్వాల్ శ్రీ వేంకటేశ్వర మహిళా మండలి వాళ్ళు రేడియోలో ఒక గంట ప్రోగ్రాం ఇస్తున్నారు. నాటకం, పాటలు, స్త్రీల ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాల గురించి ఒక వ్యాసం, కొన్ని జోక్స్  మొదలైనవి ప్లాన్ చేసారు. ఒక నెల రోజుల ముందు నుండీ  ప్రతి రోజూ  జానకమ్మ గారి ఇంటి దగ్గర ప్రాక్టిస్ చేస్తున్నారు. అమ్మ గొంతు బాగుంటుంది కాబట్టి పాట వ్రాసుకుని పాడాల్సిందిగా ఆజ్ఞాపించారు. "పాటే కదా అని ప్రాక్టిస్ కి రావేమో, అన్నీ ఒకటి వెంట ఒకటి టయిము ప్రకారం రావాలి, అందుకని ప్రతి రోజూ నువ్వు రావడం మానకు" అని చెప్పారు అమ్మకి.     

ఆ తరువాత వారమే రేడియో స్టేషన్ కి వెళ్ళాల్సిన రోజు కావడంతో చాలా రిహార్సలు చేసేవారు. ఆ రోజు ఆదివారం అవడంతో అమ్మతో రిహార్సల్ కి నేనూ, చెల్లి కూడా వెళ్ళాం. చెల్లికి 5వ యేడు, నాకు 7వ యేడు. నాటకం రిహార్సల్ మొదలయ్యింది.  అది జరుగుతుండగా అన్నపూర్ణ గారొచ్చారు. ఈవిడ మా చెల్లి స్కూల్ లో టీచరు. టీచర్ ని చూడగానే మా చెల్లి కొంచెం భయం భయంగా అమ్మకి దగ్గరగా జరిగింది. "భయం లేదు ,టీచరు గారికి నమస్తే చెప్పు" అంది అమ్మ. "నమస్తే టీచర్" అంది చెల్లి చిలకలా, కొంచెం సిగ్గు పడుతూ. ఆవిడ హాయిగా నవ్వారు.ఆవిడ వెంట ఇంకో ఆవిడ కూడా వచ్చారు. "ఈవిడ మా తోటికోడలి తల్లి అండీ..మా తోటికోడలి పురిటికని వచ్చారు. మధ్యాహ్నం కాస్త తోస్తుందని తీసుకొచ్చా " అన్నారు అన్నపూర్ణ గారు. "నమస్కారమండీ" అన్నారావిడ. అందరూ చిరునవ్వుతో చూసారు. "రండి కూర్చోండి" అన్నది జానకత్త. 

నాటకం రిహార్సల్ కంటిన్యూ అయ్యింది.  నాటకం లో ఉన్నవాళ్ళందరూ ఒక దగ్గిర కూర్చున్నారు. వాళ్ళ వెనక జోక్స్ చదివేవాళ్ళు , ఆ తరువాత గోడ దగ్గరగా అమ్మా, మేమూ కూర్చున్నాము. ఆ వచ్చినావిడ అటువైపు వ్యాసం చదివే ఆవిడ పక్కన కూర్చున్నారు.

అమ్మ మధ్య మధ్య ఆ కొత్తావిడని చూస్తోంది. ఆవిడ కూడా అమ్మని అదోలాగా చూపు తిప్పకుండా చూస్తున్నారు. నేనెందుకో ఇద్దరి వైపు చూసా.నా కళ్ళకి ఇద్దరూ ఒకే లాగా కనిపించారు. నేను కొద్దిగా అయోమయంలో పడ్డా. అమ్మతో గుస గుసగా "అమ్మా ఆవిడ  నీ లాగే ఉన్నారు" అన్నా. అమ్మ కూడా " నాకూ అలాగే అనిపిస్తోంది" అంది ఇంకా గుస గుసగా. నాటకం పూర్తి  అయ్యింది, జోక్స్ చెప్పే వాళ్ళు, వ్యాసం చదివే ఆవిడ అయ్యాక అమ్మ పాడింది. "ఏడ నుంచీ రాక చందమామా, జాడ తెలియగ లేదు చందమామ" అనే అందమైన చందమామ పాట పాడింది అమ్మ. మ్యూసిక్ అవీ ఏం లేవు, సోలో సాంగ్.  రైటర్, కంపోసర్, సింగర్ అన్నీ అమ్మే. అన్ని కార్యక్రమాల మధ్య అమ్మ పాట ఎంత బాగుందో అని అందరూ మెచ్చుకున్నారు మొత్తం కార్యక్రమం అయ్యాక. "అన్నీ బానే వచ్చాయి, కానీ ఇంకా బాగా ప్రాక్టిస్ చెయ్యాలి. సరే మరి, రేపు మధ్యాహ్నం 2 కల్లా అందరూ వచ్చెయ్యండి, పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి అవచేసేద్దాం" అన్నది భాస్కరమ్మత్త. అందరూ వెళ్ళిపోవడానికి లేచారు. 

కొత్తావిడ అమ్మ దగ్గరకొచ్చి, "మీ పాట భలే బాగుందండీ"  అన్నారు. అమ్మ చిరునవ్వు నవ్వింది. (అప్పట్లో థ్యాంక్యూలూ అవీ ఎవరూ వాడడం నాకు పెద్దగా గుర్తు లేదు) ."మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది.మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కూడా ఉంది , మీది ఏ ఊరు" అని అన్నారావిడ. ఫలానా ఊరు అని అమ్మ చెప్పింది. "కొంప దీసి నువ్వు సరోజవు కాదు కదా" ఆశ్చర్యంగా అన్నారావిడ. అమ్మ ఇంకా ఆశ్చర్య పోయింది,  "నా పేరెలా తెలుసు మీకూ" అని!  "అయితే  నువ్వు.. ..నువ్వు సరోజవేనా " అని ఆవిడ గట్టిగా అరిచారు..."అవునండీ మీరు?" ఏదో గుర్తుకొస్తున్నట్టు అమ్మ కంఠం రుధ్ధమయింది.  "నేను సీతనే" అన్నారావిడ అమ్మ చేయి పట్టుకుంటూ.   అందరూ వింతగా చూస్తున్నారు. అప్పటికే  వీళ్ళిద్దరూ మాటల్లేకుండా  ఒకరి భుజాన ఒకరు తల పెట్టుకుని వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. అవి ఆనంద భాష్పాలని అందరికీ అర్థం అయ్యింది కానీ, ఇద్దరూ వాటిని తట్టుకునే పరిస్థితిలో లేరు. అన్నపూర్ణ గారు ఖంగారు పడి," పిన్ని గారూ,పిన్ని గారూ " అని సీత గారి చెయ్యి లాగుతున్నారు. ఎవరో ఒకరు కల్పించుకోకపోతే లాభం లేదనుకుందేమో, భాస్కరమ్మ అత్త దగ్గరగా వచ్చి, "ఊర్కోండెహె...ఏమిటీ ఈ సస్పెన్సూ! సినెమాల్లో కంటే ఎక్కువగా ఉందీ, ఇంతకీ కథా కమామీషూ ఏంటొ చెపితే మేమూ ఆనందిస్తాంగా,  ఇలా ఏడుస్తూ మా అందరినీ ఏడిపిస్తే ఎలా "  అని పరాచకాలాడింది.  వెళ్ళబోతున్న వారంతా ఆగి చూస్తున్నారు. ఇద్దరూ వెక్కిళ్ళు ఆపి బలవంతంగా నవ్వారు.

 

సంగతేంటయ్యా అంటే వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలుట.  ఉమ్మడి కుటుంబం . ఇద్దరికీ 3 నెలల వయసు తేడా. 13వ ఏట ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసారుట. పెళ్ళిళ్ళయ్యాక ఒక్క సారెప్పుడో ఇద్దరూ ఒకేసారి పుట్టింటికి వెళ్ళిన గుర్తుట. పెద్ద కుటుంబమవడం వల్ల  అమ్మకి పుట్టింటికి పెద్దగా వెళ్ళే అవకాశం రాలేదనుకుంటా. తరవాత ఇద్దరూ ఒక్కసారి ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళలేదుట. అమ్మమ్మ , తాతయ్య చనిపోవడం, నాన్నకి ట్రాన్స్ఫర్లవడం ఇత్యాది కారణాల వల్ల అమ్మ ఇద్దరన్నయ్యలు పుట్టాక పుట్టింటికి ఇంక వెళ్ళలేదు. ఫోన్లు అవీ లేని కారణంగా ఒకళ్ళ వివరాలు ఒకళ్ళకి తెలీలేదు. ఆ మాటకొస్తే చూచాయగా అమ్మ సికందరాబాదులో ఉంటోందని కూడా సీత పిన్నికి తెలీదుట.

అక్కణ్ణుంచీ ఇంక చెప్పేదేముందండీ..అక్కా వాళ్ళింట్లోంచి సీత పిన్ని మకాం మా ఇంటికి మారింది. అక్కా చెల్లెళ్ళిద్దరికీ పగలూ లేదు రాత్రి లేదు. ముప్ఫై ఐదేళ్ళ సంఘటనలు, ఊరి విషయాలు ఏ ఒక్క రోజు సంగతులూ విడవకుండా చెప్పుకుంటూనే ఉన్నారు.మాకు అర్థ రాత్రి ఎప్పుడు మెళకువ వచ్చి చూసినా ఇద్దరూ తెగ ముచ్చట్లు.  మాకూ ఒక కొత్తక్క దొరికింది.  బోనస్ గా చిన్నారి పాపాయి. పిన్ని ఊరెళ్లి పోయినా, అక్క బావ ప్రతి రోజూ సాయంత్రం బుజ్జి పాపాయిని తీసుకుని ఇంటికొచ్చేవారు. పిన్ని కూడా తరచుగా వస్తుండేది లెండి.ఏతా వాతా అన్నపూర్ణ గారంటే మా చెల్లికి భయం పోయింది. పాపాయి కోసం అక్కా వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అన్న పూర్ణక్కా అంటూ పలకరిస్తోంది కూడా!

 

సినిమాల్లో చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయిన అక్కా చెల్లెళ్ళో , అన్నదమ్ములో  మళ్ళీ దొరికితే నవ్వుకుంటాం కానీ, నేను మాత్రం ఇలా ప్రాక్టికల్ గా చూశేసానండీ  అమ్మ ఆనందాన్ని. ఇద్దరినీ చూస్తే మాత్రం కవల పిల్లలేమో అనిపించేది. విశేషం ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దో, ఎవరు చిన్నో ఇద్దరికీ గుర్తు లేదుట.  మేము వాళ్ళని సీత పిన్ని,  బాబాయని  పిలిస్తే, సీత పిన్ని పిల్లలు అమ్మా నాన్నని పిన్ని బాబాయ్ అని పిలిచేవారు.(తరవాతెప్పుడో, ఏవో పౌర్ణమి అమావాస్య లెక్కలేసి తేల్చుకున్నారు కానీ అప్పటికే టూ లేట్ అయిపోయింది. పైగా ఇలా పిలిపించుకోవడం వాళ్ళిద్దరికీ సరదాగా ఉండేది). 

 

అమ్మ పోయాక మేమూ దేశాలు పట్టి తిరుగుతూ, చుట్టాల గురించి పెద్దగా పట్టించుకో లేదు. మొన్న గుర్తొచ్చి మా చెల్లిని అడిగా "సీత పిన్ని ఎలా ఉందీ" అని. "అదేంటక్కా పిన్ని పోయి అప్పుడే మూడేళ్ళయిందిగా నీకు తెలీదా" అంది. ఫోన్ లు లేని అమ్మా వాళ్ళ కాలం కంటే వెనకబడి ఉన్నందుకు నన్ను నేను తిట్టుకున్నా. అంతకంటే ఏంచేస్తాం చెప్పండి!!!  

బ్లాగ్వనభోజనం: పాఠోళి

Saturday, November 16, 2013

పాఠోళి  ఒక ఒరియా వంటకం(ట) మన దగ్గరికి ఎలా వచ్చిందో కానీ, కూరలు లేవురా దేవుడా అనుకున్న టయింలో నేనున్నాగా అంటుంది. ఇంట్లో కూరలు లేనప్పుడు చక చకా చేసేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
శెనగ పప్పు 1కప్పు
పెసర పప్పు 1 కప్పు
ఎండుమిరప కాయలు 12 ( మీ ఇష్టం మరి 3 నించి ఎన్నయినా వేసుకోవచ్చు)
జీల కర్ర
కరివేపాకు
ఉప్పు (సరిపడా)
నూనే పెద్ద గరిటెడు (ఇక్కడ హెల్త్ కాన్షియస్ అన్నారంటే మాత్రం దేవుడే మిమ్మల్ని కాపాడాలి) !
ఇంగువ చిటికెడు (ఇష్టమైతేనే)

శెనగ పప్పు, పెసరపప్పు కడిగేసి నీళ్ళల్లో నానబెట్టాలి.
మిరపకాయలు కూడా కడిగేసి వాటితో నానబెట్టాలి.
2 గంటల తరవాత, యీ మూడింటిని ఉప్పు వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి.
పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. నూనె మిశ్రమం మొత్తానికి అంటేలా కలిపి, సిం లో పెట్టి మూత పెట్టాలి. ప్రతి 5 నిమిషాల కొక సారి  కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అరగంట పైగా పడుతుందనుకోండీ, కొచెం ఓపిక కావాలి మరి !
బాగా మగ్గిందనిపించాక గిన్నె లోకి తీసుకుని గరిటతో ఒక సారి మెదపాలి. పక్కన చారు/రసం పెట్టుకుంటే అన్నం లోకి చాలా బాగుంటుంది.
(కొంతమంది మెంతి ఆకులు కూడా వేస్తారుట, నేనెప్పుడూ వెయ్యలేదు.)

ఎప్పుడైనా నాన బెట్టిన శెనగలు ఉండి అవి పాడైపోతాయనుకుంటే, వాటితో కూడా ఇదే పద్దతిలో పాటోలీ/
పాఠోళి చేసుకోవచ్చు. కొంచెం రుచి తేడా తో అది కూడా చాలా బాగుంటుంది.

ఈ సారి అనేక కారణాల వల్ల పుట్టిన రోజు జరుపుకోవట్లేదు నేను, అందుకని వనభోజనాల్లో భోజనం చేసేసి, నన్నో సారి శతమానం భవతి అని దీవించెయ్యండి మరి! (ఇలా అనుకుంటా కానీ సంవత్సరానికి పట్టుమని పది టపాలైనా వ్రాయట్లేదు, అందుకే మరి మీ దీవెనలత్యవసరం, దీవించేస్తారుగా!)

బుడ్డోడు

Sunday, November 3, 2013

ఎండాకాలం సెలవల్లో సాయంత్రం అందరం బయట అరుగు మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంటి ముందు లారీ ఆగింది .  అందరం అటువైపు చూసాము. ఇంటి ముందర ఉన్న ఖాళీ ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టున్నారు. ఇద్దరు మగ వాళ్ళు దిగారు.  ఇంటి వైపు వస్తూ, 
 " కాశీకర్ గారితో మాట్లాడామండీ తాళాలు మీ ఇంట్లో తీసుకోమన్నారు" అని చెప్పారు ఒకాయన. "రండి రండి" అని లోపలికి పిలిచారు నాన్న. అమ్మ తాగడానికి  నీళ్ళు తెచ్చింది . ఈ లోపు పిల్లలూ ఆడవాళ్ళు దిగి అక్కడే నించున్నారు. "రండమ్మా నీళ్ళు తాగుదురుగానీ " అని పిలిచింది అమ్మ. "మేము ఇద్దరం అన్నదమ్ములమండీ మిలటరీ లో పని చేస్తున్నాము. బరేలి నించి ఇద్దరికీ ఇక్కడ ఎం సి ఈ ఎం ఈ కి వేసారు. స్నేహితుడొకడు చూపించాడు ఈ ఇల్లు. మా స్వస్థలం రాయలసీమ"  అని చెప్పారు పెద్ద రెడ్డి గారు. అందరూ  అరుగు మీద కూర్చున్నారు. అయిదుగురు పిల్లలు. రాజ్య లక్ష్మి, భాగ్య లక్ష్మి, నరసింహా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డీ అని గబా గబా పేర్లు చెప్పుకున్నారు మొదటి నలుగురు.  పెద్దాయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు, చిన్నాయనకి ఇద్దరు మగ పిల్లలు అని చెప్పారు.  అందరిలోకీ చంటాడు  రెండేళ్ళవాడు . మూతి  సున్నాలా పెట్టి అదోరకం చప్పుడు చేస్తున్నాడు. అమ్మ పిల్లలకి మురుకులు పెట్టింది . నీ పేరేంటీ అని అడిగాన్నేను. అదే పనిగా   చప్పుడు చేస్తున్నాడు.  "బుడ్డోడా" అని పిలిచారు నాన్న .  ఠక్కున చూసాడు. అప్పటి నించీ వాడికి అదే పేరు. అసలు పేరు రాజశేఖర్ రెడ్డి (ఏమో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) అయ్యుండొచ్చు.

నరసింహ , బుడ్డోడు ఒకే పోలికతో ఉండడం మూలాన ఇద్దరు చిన్న రెడ్డి గారి పిల్లలని మేము అనేసుకున్నాము, చాలా రోజులకి గానీ తెలీలేదు చందూ , బుడ్డోడు సొంత అన్నదమ్ములని. వచ్చీ రావడం తోనే కాలనీలో రెడ్డి సహోదరులు తెగ ఫేమస్ అయిపోయారు. అన్నదమ్ములిద్దరికీ ఇంకో స్నేహితుడు అక్కర్లేదు. ఇంటికొస్తూనే ఇద్దరూ మేడ మీద కూర్చుని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. పెద్దావిడ క్రోషా అల్లుతారు. దానికి కావలసిన దారం టోకున కొనుక్కొచ్చి అన్నదమ్ములిద్దరూ ఖాళీ సమయాల్లో చిక్కులు పడకుండా దారాన్ని కండెలకి చుట్టి పెడతారు. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అవడం వల్ల  కావచ్చు చాలా సరదాగా గడిపేస్తారు. పిల్లలకి కూడా ఇంకోళ్ళ ఇంటికెళ్ళే పని లేదు. వాళ్ళకి వాళ్ళు చాలు. భయ భక్తులతో ఎక్కువ అల్లరి చేయకుండా ఆడుకుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలైనా బావగారికి, మరదలికీ జరుగుతాయి తప్ప ఇంక ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు. మళ్ళీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వదినా మరుదులు మాత్రం ఏమీ కానట్టే ఉంటారు. మగ వాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక, అక్క చెల్లెళ్ళు బుడ్డోడిని తీసుకొచ్చి మా ఇంట్లో కూచుని అమ్మతో కబుర్లు చెప్పేవారు. నాన్న ఏవో ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటే వినడం వాళ్ళకి ఇష్టం . బుడ్డోడు మాత్రం మా అందరికీ తెగ అలవాటయ్యాడు. పై నలుగురూ పరిగెత్తే ఆటలాడుకుంటుంటే, బుడ్డోడు మాత్రం మా ఇంట్ళొకొచ్చి టీవీ పెట్టమని నాన్నని అడిగి దాని ముందు అలా సెట్టిల్ అయ్యేవాడు. చీకట్లో కళ్ళు మెరిపిస్తూ టీవీ  చూస్తూ అలానే నిద్రపోయేవాడు. అందరం బాగా ముద్దు చేసేవాళ్ళం . ఇంట్లో ఏం  చేసినా బుడ్డోడికి పెట్టావా అని అడిగేవారు నాన్న.


రెడ్డిగారింటికి ఎవరో చుట్టాలొచ్చారు  రెండు రోజులుగా ఎవరూ ఇటువైపు రాలేదు. కాలేజీ నించి నేను ఇంటికొచ్చేటప్పటికి అమ్మ చెల్లితో  "పొద్దున్న మన మేడ మీద స్థలం సరిపోక , రెడ్డి గారింటి మేడ మీద కూడా వడియాలు పెట్టాను. మన మేడ మీదవి నేను తెస్తా ,మబ్బు పట్టేట్టుంది అక్కా నువ్వూ వెళ్లి రెడ్డి గారి మేడ మీద వడియాలు పట్టుకొచ్చెయండి"  అంది . సరే అని పైకి వెళ్లి వడియాలు తీసాము. ఈ లోపు బాగా నల్ల మబ్బు పట్టింది. ఏ నిమిషాన అయినా వాన రావచ్చు. పైన ఒక పక్క రెడ్డి గారి భార్య బొంతలు, రగ్గులు ఎండకి వేసి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు బిజీగా ఉన్నారుగా. మడత పెట్టి కింద పెట్టేస్తే తీరిక అయ్యాక తీసుకెళతారులే అని నేను చెల్లి అన్నీ మడత పెట్టేస్తున్నాము .(అప్పట్లో గుడ్ గాళ్ల్స్ అని పేరు తెచ్చుకోడానికి ఇలాంటివి చెయ్యక తప్పేవి కావు మరి!) ఇంతలో రెడ్డి గారు ఇంట్లోంచి పెద్దగా" అమ్మా బుడ్డోడున్నాడా ఆడ" అని అరిచారు. "లేడంకుల్ ఇక్కడ" అన్నాను నేను.
"ఏంటి అంకుల్ బుడ్డోడు ఇంటివైపు  రాలేదసలు "అన్నాన్నేను. "నాన్న కూడా అడిగారు ఇవాళ రాలేదేంటని "అంది చెల్లి . "చాలా సేపటి నుంచీ కనిపించట్లేదమ్మా. అక్కా వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో కొంచెం  చూస్తారా" అన్నారాయన. వడియాలూ , మడత పెట్టినంత వరకూ బట్టలూ తీసుకుని కిందకి పరిగెత్తాము. అందరం తలో వైపూ వెతుకుతున్నాము .  చాలా సేపు కనిపించకపోతే మా ఇంట్లో ఉండి ఉంటాడులే అనుకున్నారుట. పెద్ద రెడ్డి గారు మాత్రం అరుస్తున్నారు. పిల్లోడు ఎక్కడున్నాడో చూసుకోవక్కరలేదా అని. నాన్న మాత్రం ఖంగారు పడకండి రెడ్డి గారూ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు  అన్నారు. ఇంటి వెనక చెరువు ఉంది. అటు కొందరు వెతికి వచ్చారు. కొత్తగా ఇళ్ళు కడుతూ ఉండడంతో చాలా వరకూ నీళ్ళ  బావులు తవ్వుతూ వదిలేసి ఉన్నాయి. 
చెరువు నీళ్ళు పారే చోట లోయలా ఏర్పడింది. అది కాక వెనక అంతా ఖాళీ ప్రదేశం. ఇవన్నీ కాక ఆ మధ్యే పిల్లలని ఎత్తుకుపోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. చిన్న రెడ్డి గారు మాత్రం బావుల దగ్గరికెళ్ళి పెద్దగా వాడిని పిలుస్తూ తొంగి చూస్తున్నారు. అందరం తలో వైపూ పరిగెత్తి మళ్ళీ ఇంటి దగ్గరికొస్తున్నాం ఏమైనా తెలిసిందేమోనని.  చాలా మంది రెడ్డి గారి ఇంటి ముందు నిలబడ్డారు. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చారు .  ఎవరికీ వాళ్ళు ఫలం, పుష్పం,తోయం,ఉపవాసం, కొబ్బరికాయలు, ప్రదక్షిణలు, వడమాలలు మొక్కేసుకున్నారు వారి వారికి ఇష్టమైన దేవుళ్ళకి. చీకటి పడింది. ఇంకొక్కసారి మళ్ళీ వెతికిన చోటే వెతికి రమ్మని నాన్న అందరికీ చెప్పబోయారు. చిన్న రెడ్డి గారొచ్చి, " వద్దు నాయనా, ఇంకెందుకు అందరికీ కష్టం, వాడు ఇంక మనకి లేడు, పొద్దున్నే కిష్టయ్యని పిలిచి బావిలల్ల వెతికిద్దాం కనీసం చివరి చూపు చూసుకోవచ్చ"ని అన్నారు. ఈ మిలటరీ వాళ్ళు బంగారంగాను ఇంత  మాటనేసినాడు!  అక్కడున్న వాళ్ళన్దరూ బోరుమని ఏడ్చారు. బాగా చీకటయ్యక ఎవరింటికి వారు వెళ్ళారు కానీ ఎవరికీ తిండీ నిద్రా ధ్యాస లేదు. అలా కూర్చుని వాడి కబుర్లే చెప్పుకుంటున్నాము.
 

ఇంతలో వాన మొదలయ్యేట్టుంది , జల్లు లోపలికి రాకుండా తలుపు దగ్గరికి వేసాము. అసలే దుఃఖం పైగా ఆకాశం కూడా ఏడవడానికి సిధ్ధపడుతున్నట్టుంది .  నాన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళు తట్టుకునేట్టు చూడమని. ఈ లోపు బయట కలకలం వినిపించింది. పోలీసులొచ్చినట్టున్నారు. అందరం బయటికొచ్చాము. పోలీసులు ప్రశ్నలడుగుతున్నారు. బుడ్డోడి ఫొటో ఇమ్మన్నారు. ఇల్లు వెనకా ముందూ అంతా చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.  వర్షం మొదలయ్యింది. "మే బట్టలున్నయేమొ మిద్దె మీన " అంది వాళ్ళ చుట్టాలావిడ. "అన్నీ తెచ్చేసామాంటీ ఒక్క దుప్పటి మాత్రం మిగిలింది తెస్తా ఉండండి" అని చెల్లి పైకి పరిగెత్తింది. 2 నిమిషాల్లో చెల్లి పెద్దగా అరిచింది. రెడ్డి గారు పైకి పరిగెత్తారు. రెడ్డి గారు అందరినీ  పిలుస్తున్నారు పిల్లోడు దొరికాడని .   ఒక్క సారిగా అందరం ఆనందంతో అరిచాము. ఎక్కడ దొరికాడు అని ! "మీన  దుప్పట్లు ఎండేసినారుగా ఆటి  కింద నిదురబోయినా డేమో, చినుకు పడంగల్నె ఏడుపు ఎత్తుకున్నాడు " పెద్ద రెడ్డిగారు ఆనందం పట్టలేక పోతున్నారు. "అదేన్దబ్బా పిల్లోల్లు మీనకేంచి  బొంతలు తెస్తిరిగా "అన్నది వాళ్ళ చుట్టాలావిడ. "అవునండీ కానీ ఒకటే దుప్పటి మిగిలి పోయింది. అదొక్కటీ తీసే లోపు పెద్దంకుల్ బుడ్డోడు కనిపించట్లేదని చెప్పారు. అయినా ఆ దుప్పటి కింద వాడు ఉన్నట్టు అసలు తెలీలేదు, కదా" అని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ చెల్లీ, నేను సంజాయిషీ ఇచ్చుకున్నాము. అసలింత గోల జరుగుతున్నా వాడికి మెళకువ రాకపోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది . "ఎండకు సొమ్మసిల్లి ఉంటాడు మే, సన్న పిల్లోడు గదా "అన్నది చుట్టాల్లో పెద్దావిడ." ముందర అన్నం పెట్టండమ్మా " అన్నారెవరో. "చిన్నమ్మా ఉండు వాడికి దిష్టి తీస్తా అందరి కళ్ళళ్ళొ పడ్డాడు చిన్ని తండ్రి" అంది అమ్మ. అందరం తెగ ఆనంద పడి ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకున్నాము. అంతే  కాకుండా దుప్పట్లో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతికారట అనే సామేత మళ్ళీ ఋజువయ్యిందని మర్నాడు ఊర్లో అందరూ చెప్పుకుని నవ్వుకున్నారు.

మొన్న ఆదివారం ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదు ఇంట్లో . కొంచెం భయపడి మళ్ళీ మళ్ళీ చేసా. మర్నాడు ఉదయం అక్క తీసింది ఫోను. "ఏంటీ ఫోన్ తియ్యరూ, నాన్న ఎలా ఉన్నారో అని ఎంత ఖంగారు వేసిందో ఎక్కడికి పోయారందరూ "అని విసుక్కున్నా. "అదేంటే, బుడ్డోడి పెళ్లి కదా అందరం వెళ్ళాము నీకు చెప్పమని మరీ మరీ చెప్పారు, అక్క చెప్పలేదా అంది". వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుని కొంచెం దూరం గా ఉన్న మూలాన ఈ 25 యేళ్ళుగా నేను వాడిని  కలవలేదు. దేనికో మధ్యలో ఒకసారి వాళ్ళింటికి వెళ్ళా కానీ బుడ్డోడు లేడు  ఇంట్లో. "అంత  పెద్దాడయ్యేడావే " అన్నా ఆశ్చర్యంగా ."గుర్తుందా నీకు వాడి చిన్నప్పుడు "అని మొదలెట్టింది.
" అబ్బా!అది మర్చిపోయే విషయమా తల్లీ కళ్ళకు కట్టినట్టుంది"  న్నాన్నేను. "మరింకేం  వ్రాసి పెట్టు వాడికి చూపిస్తా "అంది అక్క.  అందుకని మొదలెట్టేసినానబ్బా. మీరూ మా బుడ్డోడిని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దీవించెయ్యండి మరి !







మావిడి పళ్ళవాడి పెళ్ళి

Tuesday, May 7, 2013



ఎర్రటి ఎండ..చెమటలు కక్కుతూ నడుస్తున్నా..ఒక్కడైనా దొరక్కపోతాడా అని ఆశ! సందు చివర చెట్టు కింద టెంట్ కింద చల్లటి నీడలో ఉన్నాడు వాడు.. అమ్మయ్య అనుకుని దగ్గరగా వెళ్ళాను. అమ్మా పండ్లు ఎన్ని తూకమెయ్యాల అని అడిగాడు. పళ్ళ సంగతి తరవాత నీకు పెళ్ళయ్యిందా అని అడిగా..

పెద్ద పెద్ద ఆఫీసర్లకే పిల్లలు దొరుకుతల్లేరు, నన్నెవరు చేసుకుంటరు తల్లీ అన్నాడు. నీకెందుకు నేను చూపిస్తాగా అన్నా...పళ్ళు  ఎన్ని కావాలీ  అన్నాడు. చెప్తారా  బాబూ కానీ ఒక నిమిషం నన్ను మాట్లాడనీయి.   పెళ్ళంటూ చేస్తే  నీ లాంటి వాడికే చెయ్యాలి  నీకు ఎలాంటి పిల్ల కావాలి అని అడిగా. వెటకారం  అనుకున్నాడేమో నువ్వు ఎవరిని చూపిచ్చినా సరే  అన్నాడు. అబ్బా నువ్వెంత మంచోడివో, అందుకే నీతో కానీ ఖర్చు కూడా పెట్టించను  పెళ్లి ఖర్చు కూడా నాదే. మీ అమ్మా నాన్నతో కూడా మాట్లాడతా  .నిజం..నీ పెళ్ళి చేసే పూచీ నాదీ అన్నా. చిన్నగా నవ్వాడు. ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడిని మాటల్లో దింపి  రోజుకి ఎంత సంపాదిస్తాడు , అమ్మా నాన్నా ఎక్కడుంటారు , అన్నదమ్ములు ఎందరు  అక్క చెల్లెళ్లు ఎందరు   ఇల్లెక్కడ  అన్నీ కనుక్కున్నా.  ఎవల  కోసమమ్మా , పిల్ల బాగుంటదా , పిల్లని ఎప్పుడు చూపిస్తవ్ అన్నాడు.  .

 

ఇంకో బేరం రావడంతో సరే కానీ పళ్ళెన్ని కావాలమ్మా  అని అడిగి కిలొ పళ్ళు తూకమేసి ఒక రూపాయి తక్కువే ఇయ్యమ్మా..యీ దిన్నాల్ల అమ్మా అయ్యలకే పడతల్లేదు..నువ్వు పెండ్లి చేస్తా అంటున్నవు..నీ కాల్మొక్కుత అన్నాడు..సర్లె నువ్వు డబ్బులు తగ్గించాలని కాదు..నీ పెళ్ళి చెయ్యడమే నాకు ముఖ్యం అని పూర్తి డబ్బులు చేతిలో పెట్టి పళ్ళు తీసుకుని, "నేనొచ్చేలోగా దొరికారని ఎవర్నో ఒకర్ని చేసుకోకురోయ్ మంచి పిల్లని తెస్తా" అన్నా... నవ్వుతూ తలూపాడు వచ్చిన వాళ్ళకి ధర చెపుతూ. వీడు సరదాగా తీసుకుంటున్నాడు. నా సంగతి వీడికి తెలియదు.  తలచుకుంటే  ఒక్క  పెళ్ళేంటీ వంద చేస్తా

 

 

అమ్మయ్యా పిల్లాడు దొరికాడు, అమ్మో ఇప్పటికి ఎంత మందిని అడిగాను పెళ్ళి చేస్తారా బాబూ అని...చివరికి ఒక్కడు ఒప్పుకున్నాడు . సగం  పని అయినట్టే . ఇంక మగ పిల్లల కోసం వెతకక్కరలేదు.  మొత్తం టయిమ్  అమ్మాయిని వెతకడానికే పెట్టచ్చు. చక్కని పిల్ల దొరికితే బాగుణ్ణు. పిల్ల దొరికి యీ పెళ్ళి జరిగితే ఉండ్రాళ్ళు  పోస్తానని వినాయకుడికి మొక్కు కున్నా ..

 

ఇంక పిల్లని వెతకడమే పని. ఏ పిల్లని చూసినా మా వాడికి ఈడు జోడు అనుకోవటం..ఆ పిల్ల తలితండ్రులని కలవటం.ఆ పిల్లాడు నాకేమవుతాడు, అసలు యీ పెళ్ళి చెయ్యడం లో నాకెందుకు ఆసక్తి లాంటి దిక్కుమాలిన ప్రశ్నలన్నీ అడగడమే తప్ప..అయ్యో పని మానుకుని ఒక పెళ్ళి చెయ్యాలనుకుంటోంది అని అనుకున్నవాడే దొరకట్లేదు .

 

 

 బొల్లారం బజార్ లో నడుస్తూ ఉండగా ఒక ముసలతను మావిడి పళ్ళ బండి పక్కన కనిపించాడు. ఆగుదామా వద్దా అనుకునేంతలో  ఇరవయ్యేళ్ళ  పిల్ల బండి వెనక నించి బయటకొచ్చి" నాయిన నువ్వు బువ్వ దిను...బండి కాడ నేనుంటా" అని అంటొంది..చూద్దును కదా పిల్ల అతిలోక సుందరి..మా జగదేక వీరుడికి చక్కని జోడీ.  కుదిరితే బాగుణ్ణు  అనుకుంటూ ఎంతకిస్తావు అని మాట కలిపా...కిలొ అయితే డెభ్భయమ్మా రెండు తీస్కుంటె అర్వైఐదు ..మూడయితే  అర్వై మూడు  అంది..అబ్బో వ్యాపారం బానే వచ్చు నీకు అన్నా.  బోల్డు సంబర పడిపోయింది .నీకు  పెళ్ళయ్యిందా  అని అడిగా ...లేదు సిగ్గు పడింది. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అన్నా. అక్కకు పెండ్లయ్యింది. ఒక తమ్ముడు అంది. సరే గానీ మా వాడొకడు ఎర్రగా బుర్రగా బాగుంటాడు చేసుకుంటావా అని అడిగా..ఏం చేస్తడు అంది..మీ లాగే మావిడి పళ్ళ వ్యాపారం, లాల్ బజార్ చౌరాస్తా లోనే.   ఇద్దరిదీ  అదే వ్యాపారం కాబట్టి భలే ఉంటుంది..నువ్వు చక్కగా  అక్కడ బస్సెక్కి ఇక్కడ దిగచ్చు, ఇక్కడ బస్సెక్కి అక్కడ దిగచ్చు. నాన్నకి కూడా దగ్గర. చిలకా గోరింకల్లా చక్కగా ఉండచ్చు అన్నా..నన్ను ఎగా దిగా చూసి , అసొంటోల్లు మా కాడికి దునియ వచ్చి పోతరు.అసొంటోడు సాలంటె పదారేల్లకే చేసుకోకపోదునా..మొన్ననే గవర్నమెంటు కొలువున్నోడు వొస్తెనే వొద్దన్న. యీ బండి బాబులకు తక్కువయిందా అంది. అబ్బో పిల్ల తెగ మాటకారే అని అది కాదు తల్లీ మా పిల్లాడు రోజుకి 2000 పైన సంపాదిస్తాడు ,  పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్నా. .

 

అమ్మా పండ్లు కొంటవా కొనవా..నా టైము ఖరాబ్ చెయ్యకు అంది..నేను ఖంగు తిని అహ అది కాదు పెళ్లి ఖర్చంతా నేనే పెడతా మీ నాన్నని పిలువు మాట్లాడతా అన్నా. నాయనా యీమె చూడే .  నాకు ఎవడో పిలగాడ్ని తెస్తదంట అంది.. ఆ మాటలో ఆ పెద్దాయనకి ఏం అర్థం ధ్వనించిందో..ఎవరే అది  అంటూ గబా గబా వచ్చి ఎందమ్మా ఏమ్మాట్లాడుతున్నవ్ అని   మీదకొచ్చాడు..ఎందుకయ్యా బాబూ అలా మీదకొస్తున్నావు..నేనేమీ కాని మాట అనలేదు..తెలిసున్న పిల్లాడొకడున్నాడు పెళ్ళికి ఒప్పిద్దామని మాట్లాడుతుంటేనూ అన్నా.  పిల్లతోని మాటలేన్ది పండ్లు కొనుక్కుంటే కొనుక్కో లేకుంటే లేదు అన్నాడు.  మంచి పిల్లాడయ్యా  బాబూ నిదానంగా ఉండు వివరాలు చెప్తా అన్నా. వివరాలు ఒద్దు ఏమొద్దు , పిల్లకు ఇప్పుడే పెండ్లి చెయ్య అన్నాడు.  మంచి సంబంధమని చెప్తున్నాగా  పైగా  పెళ్లి ఖర్చంతా నాదే అయినా పెళ్ళీడుకొచ్చిన  పిల్లని ఎన్నాళ్ళిలా నీ దగ్గరే పెట్టుకుంటావూ అన్నా..అతనికి పిచ్చి కోపమొచ్చినట్టుంది..నా పిల్లని నా దగ్గరే  పెట్టుకుంటానో, అమ్ముకుంటానో, చంపుకుంటానో నీకెందు నా బిడ్డ నా ఇష్టం నువ్వెవరు చెప్పనీకి అని అరిచాడు..ఈ అరుపులకి చుట్టు పక్క బళ్ళ వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టినంత పని చేసారు. ఈమెతోని మాటలేందన్న  పోలీస్ టేషన్ల చెప్పుపో  బుద్దొస్తది అని ఒక బండి తాలూకా మనిషి అరిచింది..బాబోయ్ ఇదెక్కడ న్యాయం..పిలిచి పిల్లనిస్తానంటే అలిగి చెట్టెక్కాడన్నట్టు...కానీ ఖర్చు లేకుండా పెళ్ళి చేస్తానంటే ఇదెక్కడ గోల   అయినా ప్రపంచం లో ఈ పిల్ల ఒకతే  ఉందా ,ఈ పిల్ల  కాకపోతే ఇంకొకతి.. మీ  బాబు లాంటి సమ్మంధం తేకపోతే చూడండి  అని ఆయాస పడిపోయా..

 

ఈ లోపు  ఎవరో పోలీస్ ని పిలుచుకొచ్చారు. ఆయన అక్కడున్న వాళ్ళని  ప్రశ్నలడుగుతున్నాడు. అదృష్టం బాగుండి మా లల్లీ అటువైపొచ్చింది. వాళ్ళ ఆయనకి ఇక్కడ రాజకీయ పార్టీలో పలుకుబడి ఉంది లెండి..తనని చూడగానే పోలీసతను నమస్తే మేడమ్ అన్నాడు. ఏంటండీ , ఏమయింది అంది. ఏమో అమ్మా, ఈమెవలో మా ఆడ పిల్లలకి పోరగాల్లని తెస్తా అని పరేషాన్ చేస్తుంది అని అన్నారెవరో . లల్లీ పోలీస్ వైపు తిరిగి  అదేంటండీ ఈమెని గుర్తు పట్టలేదా మన భాస్కరన్న వాళ్ళ  చెల్లి అంది . అయ్యో గుర్తుపట్టలేదు మేడమ్ , బాగా చిన్నప్పుడు చూసా అమెరికా లోనా ఉంటున్నది అన్నాడు.  కాదులెండి కెనడాలో , సరే మరి ఉంటాం అని చెప్పి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది నన్ను.

ఇక్కడేంచేస్తున్నావే అంది ఇంటి వైపు తీసికెళుతూ . నీకు తెలుసుగా

మావిడి పళ్ళ వాడి పెళ్ళీ అన్నా. నాకు పూర్తిగా తెలీదు కానీ అందరూ చెప్పుకుంటున్నారు.  యీ మధ్య మావిడి పళ్ళ బళ్ళ చుట్టూ తిరుగుతూ అవసరం ఉన్నా లేకపోయినా మావిడి పళ్ళు కొంటున్నావట..ఏంటీ కథ అంది...నేనూ మార్గరెట్ థాచర్  అంతదాన్ని అవాలని ..అంటూ గొణిగా.

ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని సంఘము, సంస్కరణ అవీ ఇవీ అంటూ గుంపులతో కలిసి తిరుగుతావన్నది  పాత కథే కానీ మధ్యలో  ఈ మార్గరెట్ ఎవరూ అంది లల్లీ..

అదేంటీ నీకు మార్గరెట్ థాచర్ తెలీదా ఆవిడ మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి పైగా  ఉక్కు మహిళ బిరుదాంకితురాలు అని చెప్పా.. అయితే! అంది...అయితే ఏంటి ,ఆవిడలా పేరు తెచ్చుకోవాలి నిశ్చయంగా అన్నా..అంత గొప్ప వ్యక్తితో పోలికేంటే  నీకు అంది..నాకు ఇందాక అరి కాలి లో మొదలై పోలీసుని చూసి అక్కడక్కడే తిరుగుతున్న మంట గబుక్కున నెత్తికెక్కింది. పెద్ద వాళ్ళయితే వాళ్ళలాగా మనమూ పేరు తెచ్చుకోకూడదని రూలు ఉందా అని ఆవేశ పడ్డా. సరే తెచ్చుకోవచ్చనుకో, కానీ అలా పేరు తెచ్చుకోడానికీ, నువ్వు కెనడా నించి ఇంత దూరం రావడానికీ, ఇలా ఎండా కొండా లేకుండా రోడ్డెంట తిరగడానికీ , ఈ  మావిడి పళ్ళకీ  సంబంధమేంటీ అని నడుస్తున్నంత సేపూ కొచ్చన్ల మీద కొచ్చన్లు అడిగి పారేసింది.  ఇంట్లోకెళ్ళగానే లల్లీ ఇచ్చిన మాజా  చల్లబరిచిందేమో  చెప్పలేను గానీ, గొంతు తగ్గించి సున్నితమైన   స్వరంలోకి మారా. 

ఇన్ని రోజులూ నేనూ నీలాగే ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోలేదే . అసలావిడ ఎవరో కూడా మొన్న మొన్నటి దాకా తెలీదు. ముందే తెలిసుంటే  ఆ పని ఇక్కడున్నప్పుడే చేద్దును..అయినా ఇంత చిన్న పనికే అంత పెద్ద పేరా అనుకున్నా గానీ, యీ పని చాలా కష్టమేనే అన్నా ..నువ్వు కొంచెం తెలుగులో మాట్లాడతావా అంది లల్లీ. ఏం నేను మాట్లాడేది ఆంగ్లమా వెటకారంగా అన్నాను. మరి! చెప్పేదేదో సరిగ్గా చెప్పి ఏడువు. వచ్చి రెండు వారాలయిందిట , నేనే రెండు సార్లు ఇంటికొచ్చా. తమరు లేరు . అయ్యో ఒక సారి చూసి పోదామనైనా అనుకున్నావా. అదృష్టం కొద్దీ పనుండి ఈ వైపొచ్చాను. లేకపోతే ఈ పాటికి దేవకీ దేవి ఒడిలో పడుకుని ఉందువు అంది..ఆ మరే,ఆ లెక్కనన్నా చిన్ని కృష్ణుడి ట్విన్ సోదరినయ్యి పెద్ద పేరు తెచ్చుకొందును అన్నా..యీ పేరు తెచ్చుకునే గోల నేను భరించలేను గాని తల్లోయ్, నన్నొదిలెయ్ అంది లల్లీ..అదేంటే, నీకు కాస్త పలుకుబడి ఉందిగా..ఒక్క మావిడి పళ్ళ పిల్లని కుదర్చవే నీ ఋణం యీ జన్మలో తీర్చుకోలేను అన్నా.. ముందు నువ్వు నాకు అర్థమయ్యేట్టు తెలుగులో చెప్పు ఆ తర్వాత చూద్దాం అంది.

 

సరే పెద్దగా చెప్పటానికేమీ లేదు.. మార్గరెట్ థాచర్ పేరు వినడమే గానీ అంత గొప్ప ఆవిడ ఎలా అయిందో నాకు తెలీదు.  మొన్న ఏప్రిల్ 8వ తేదీన ఆవిడ చనిపోయారు. ఆ రోజు ఉందయం ఆఫీసుకి వెళుతూ కార్ లో 1650 ఎ ఎం రేడియో ఆన్ చేసా..సీనా రేడియో న్యూస్ రీడరు  ఖుర్షీద్ అక్రం గారు హిందీలో వార్తలు చదువుతున్నారు. వార్తలు విన్నాక నాకు మతిపోయింది . ఆయన చెప్పడం ఏంటంటే  ఈవిడ గారు మావిడి పళ్ళ వాళ్ళకి పెళ్ళి చెయ్యడానికే  జీవితమంతా ధారపోసిందిట.   దాని వల్లే ఆవిడకి అంత గొప్ప  పేరు వచ్చిందిట .  అది విన్నప్పటి నుంచీ నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు..ఆఫీసుకి వెళుతూనే  నెల రోజుల  వెకేషన్ పడేసి ఇటొచ్చేసా..సెలవలయ్యే లోపు కనీసం ఒక్కడికైనా చెయ్యాలి పెళ్ళి. అది గనక సక్సెస్ అయ్యి మంచి పేరొచ్చిందంటే, జాబ్ వదిలి ఇక్కడకొచ్చేస్తా..ఇంక జీవితమంతా మార్గరెట్ లాగే మావిడి పళ్ళ వాళ్ళ పెళ్ళీకే ధారపోస్తా..నేను తన్మయంగా చెప్తోంటే మా లల్లీ నమ్మనట్టుగా చూసింది. సరే గానీ గుర్తుంటే ఒక సారి ఆ వార్తని కుర్షీద్ అక్రం గారి మాటల్లో చెప్పు అంది.

ब्रिटन के आइरन लेडी मार्गरेट थाचर की कल लन्डन में निधन हुई l प्रेसिडेंट हार्पर ने कहा कि दुनियां एक अच्छी लीडर को खो गयी l मर्गरेट इतनी मशूर बनने का कारण यही है कि जीवन भर उन्हों ने आम आदमी के कल्या्ण के लिए मेहनत करती रहीं l

(బ్రిటన్ కే అయిరన్ లేడీ మార్గరెట్ థాచర్ కీ కల్ లండన్ మే నిధన్ హుయీ. ప్రెసిడెంట్ హార్పర్ నే కహా కె దునియా ఏక్ అచ్చీ లీడర్ కో ఖో గయీ. మార్గరెట్ ఇత్నీ మశూర్ బన్ నే కా కారణ్ యెహ్ హై కీ జీవన్ భర్ ఉన్ హో నే ఆం ఆద్మీ కే కల్యాణ్ కే లియే మెహనత్ కర్తీ రహీ.)

లల్లీకి ఎండలోంచి వచ్చిన మూలాన కళ్ళు తిరిగాయో, తలనెప్పి వచ్చిందో కానీ చేతులు  నుదుటి మీద రుద్దుకుంటూ కూచుండి పోయింది . ఏమయిందే అని అడుగుదామనుకున్నా ...యీ లోపు మామిడి పండ్లమ్మా మామిడి పండ్లూ అంటూ ఒక కుర్రదాని కేక వినిపించింది . ఇంక నేను ఏమీ ఆలోచించకుండా ఇంట్లోంచి బయటికి పరిగెత్తా, ఈ పిల్లనైనా ఒప్పిద్దామని.  అబ్బా మావిడి పళ్ళ గంప తెగ బరువుగా ఉంది . దింపడానికి మీరూ ఒక చెయ్యేద్దురూ!