మా ఆల్వాల్ లో 400 ఏళ్ళ నాటి వెంకన్న గుడి. ఆ పక్కనే రాధా కృష్ణుల
గుడి, పక్కన జగన్నాధ స్వామి గుడి, ఇంకో పక్క పాండు రంగడి గుడి, ఇంకాస్త దూరంలో శివుని
గుడి. తిరుపతి వెళ్ళలేని వారు మా వెంకన్న దగ్గర మొక్కు తీర్చుకోవచ్చునని ఆళ్వార్ స్వామి
దేవుని దగ్గర వరం తీసుకున్నాడుట. అందుకని చుట్టుపక్కల ఊర్ల వారందరూ వచ్చి మొక్కులు
తీర్చుకుంటుంటారు. గుడి ముందు సత్రాలు, రాజా కిషన్ ప్రషాద్ గారి దేవిడీ. ఎంత మంది రాణులుండేవారో
తెలియదు కానీ, 70,80 రూములున్నట్టుండేది దేవిడీ.
ఇంకాస్త ముందుకి ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో పోలిస్ స్టేషన్,
ఇంకా ప్రైమరీ స్కూల్ (మా ఊర్లో దీన్ని ప్రేమ టీచర్ ఇస్కూల్ అనేవారు) ఉన్నా కూడా ఇంకా
చాలా విశాలమైన మైదానం ఉంటుంది. మైదానం దాటాక ఒక మంటపం. దాటాక చాలా ఖాళీ స్థలం. మా ఊరు
మెయిన్ రోడ్ కి కొద్దిగా లోపలికి ఉండేది. ఊరిని, మెయిన్ రోడ్డుని కలుపుతూ గుడి ముందు
నుండి మెయిన్ రోడ్డు వరకు తారు రోడ్డు. రోడ్డుకి ఒక వైపు దట్టంగా కొన్ని చింత చెట్లు
ఉండేవి. చీకటి పడ్డాక ఇవి దాటి రావడం కొందరు
ధైర్యవంతులు మాత్రమే చేయగలిగే సాహసం కింద లెక్క.
ప్రతి సంవత్సరం డిసెంబరులో
వెంకన్నకి బ్రహ్మోత్సవాలు. మా వెంకన్నకి భోగం...అక్కడ దద్యోజనం లేదా పులిహోర ప్రసాదం...ఇక్కడ
ప్రసాదం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి...మా పెద్ద పూజారి గారు చాలా ఫేమస్, యెందుకంటారా...గుప్పెడు
పులిహార ఇచ్చి పంచమంటే, ప్రపంచం మొత్తం పంచి
ఇంకా చిటికెడు మిగులుస్తాడని ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు... సో, షాట్ కట్ గా ఎప్పుడయినా, ఎవరింట్లోనయినా, తక్కువ ఖర్చుతో
ఎక్కువ మందికి భోజనాలవీ పెట్టాలంటే, మా రాఘవాచారి మామని అధ్యక్షుడుగా ఉంచితే సరి! ఆయన
ప్రసాదం పెట్టే తీరు గుర్తొస్తే చాల నవ్వొస్తుంది.. ఒకొక్క మెతుకు అందరి చేతిలో విదుపుతున్నత్తు
పెట్టేవారు. విసుగు కూడా చాలా ఎక్కువ. గుడికెళ్ళీ ప్రసాదం తీసుకోగానే ఇంటికొచ్చేస్తామా
ఏంటి? మా లల్లీ, విజ్జీ, గౌ రీలతో గుడి చుట్టూ ఉన్న ధర్మ శాలల పైకి మెట్ల మీంచి వెళ్ళి,
కిందకి వాలిన చింత చెట్లకున్న కాయలు కోసుకోవాలి...అక్కడ గస్తీ తిరిగే మల్లన్న తాతకి
కనపడకుండా మెట్లు దిగి రావాలి...మెట్లు అస్సలే బహు పురాతనమయినవి...మధ్యలో ఉండగా తాత అరిచాడంటే, మన గుండె ఆగిపోవడమో, జారి పడడమో
తధ్యం...
గుడి ముందు ఈ చివరి నించి మెయిన్ రోడ్డు ఆ చివరి వరకూ గుడి ముందు
జాతర. మా ఊళ్ళో గాజులు దుకాణాలు, బొమ్మల దుకాణాలు లేవు.
ఈ జాతరకి ఎక్కడెక్కడి నించో ఆట వస్తువులు అమ్మేవారు, గాజులు
అమ్మేవారూ, రంగుల రాట్నాలు, సర్కసు వాళ్ళు వచ్చేవారు. గుర్రాలు, చిన్న రంగుల రాట్నం
అప్పుడప్పుడూ ఎక్కేవాళ్ళం. వీటి కోసం అమ్మ
అప్పుడప్పుడూ డబ్బులు ఇచ్చేది. కానీ అస్సలు సంగతంతా పెద్ద ఉయ్యాలలోనే ఉంది.."అది
చాలా ఖరీదు.. మీరు చిన్న పిల్లలు....చక్కరొస్తదీ, ఎక్కద్దు "అని అందరూ చెప్పేసే
వారే! ...మరి పిల్లలకి ఒద్దు అన్న వాటిమీదే
కదండీ మక్కువంతా! మాకు జాతర మొత్తం 20 రోజుల్లో రెండు సార్లు రెండు చారానాలు మాత్రమే
ఇచ్చేవారు కొనుక్కోవడానికి. దానిలో రెండు ఆప్షన్లు. పెద్ద తొట్టెల(రంగుల రాట్నం) ఎక్కామంటే,
ఇంక చిరుతిళ్ళకి మిగలవు. కానీ బాల్య చాపల్యం వలన చారానతో, మల్లెపువ్వుల్లాంటి తిరుపతి
మురుమురాలు, తియ్య బలపాలు, కొర్ర లడ్డూలు, సబ్జా గింజల షర్బత్ కొనుక్కునే వాళ్ళం నేనూ,
మా చెల్లీ. తీరా ఉయ్యాల ఎక్కడం తీరని కోరిక , కల అయ్యేది. కానీ దానికొక ఉపాయం తట్టింది.
సాయంత్రాలు జాతర చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి గంటలు గంటలు క్యూలలో
నిలబడక్కర లేకుండా తీరిగ్గా ఎక్కాలనుకునేవాళ్ళు పొద్దున్న 11-12 గంటల మధ్యలో వచ్చేవారు.
అది సరిగ్గా మా ప్రేమ టీచర్ స్కూల్ కి అన్నం బెల్లు టైము. ఇంటికెళ్ళి రెండు బుక్కలు
తిన్నామనిపించి పరుగెత్తుకెళ్ళి ఉయ్యాల దగ్గర పడిగాపులు పడేవాళ్ళం. దీన్ని ఎక్కాలంటే,
చాలా ఓపిక, తీరిక ఉండాలసలు! ఒక్కొక్క ఉయ్యాల నిండుతుంటే, దాన్ని పయికి పంపించి ఖాళీ ఉయ్యాల కింద ఉంచి, జనాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు దాని ఓనర్, నాలుగు ఉయ్యాలల్లో మూడు ఉయ్యాలలు నిండే వరకే మా
వెయిటింగు అంతా.. .ఆ మూడో ఉయ్యాల నిండే వరకు
ఎక్కడైనా ఆడుకోవచ్చు. మూడు ఉయ్యాలలు నిండే దాకా ఆడుకునే ఆట దాల్ దడీ దచిన పొడీ.. ఆటంటే
ఆడెసేవాళ్ళం కానీ పాట అర్థం తెలియదు. అందరినీ అడిగాక హైదరాబాదుకి చెందిన మిత్రులొకరు
దాల దడీ అంటే, హీప్ ఆఫ్ పల్సెస్ అని చెప్పారు అంటే, పప్పుల కుప్ప అన్న మాట.. ఒప్పుల
కుప్ప బదులు పప్పుల కుప్ప అన్న మాట.. రెండొ భాగానికి అర్థం తెలియలేదు. అలాగే ఉప్పిరి
గింజలని ఇంకో ఆట ఆడేవాళ్ళం. సీతాఫలం గింజలు కడిగి దాచుకునేవాళ్ళం. 3 బొద్దీలు తీసి,
ఒక దానిలో గింజలు పెట్టి, ఉష్కెతోని మూసేసాక దోస్తులని పిలవాలి. వాళ్ళొచ్చి, ఏ గుంటలో
గింజలున్నాయో ఊహించాలి. ఒక వేళ వాళ్ళకి తెలిస్తే ఆ గింజలన్నీ వాళ్ళ సొంతం, ఒక వేళ కనిపెట్టలేకపోతే,
వాళ్ళే మనకి బొద్దీలో పెట్టినన్ని గింజలు ఇవ్వాలన్నమాట. ఈ ఆటకి కూడా ఆక్ పాక్ కలేమాక్
డాం డూం డుస్, ఇస్క లడీ లాల్ చటాక్ దేఖో నికల్ గయా అని పాడే వాళ్ళం. ఈ పాటకి కూడా మాకు
అర్థం తెలియదు. గోలీలాటల్లో కూడా మామూలు గోళీలు కాకుండా లిట్కీ గోళీలని చిన్న గోళీలు
గెలవాలని ఆశ.
జాతర ఎదురుగ్గా ఉన్న శ్యాం బెనిగల్ గారమ్మాయి గౌరి, వాళ్ళింట్లో
ఉండే ఇంకొకమ్మాయి నెమ్మదిగా వచ్చేవారు మాతో ఆడుకోవడానికి. కాన్వెంటుల్లో చదివే గొప్పింటి
పిల్లలు దేవదూతల్లా మంచి బట్టలేసుకుని ఉండేవారు. వాళ్ళు మాతో ఆడడానికి ఇంట్లో వాళ్ళు
పంపేవారు కాదు కానీ, ఊరి మీద పడి తిరుగుతూ ఆడుతున్న మమ్మల్ని చూసి వాళ్ళకి మాతో ఆడాలని
, స్వేచ్చగా తిరగాలని కోరిక. పెద్దల కళ్ళలో పడకుండా అప్పడప్పుడు వచ్చేవారు. వచ్చిన
పది నిమిషాల్లోనే పెద్దలు వచ్చి, కోప్పడుతూ తీసుకుపోయేవారు. అలా వచ్చినప్పుడు మేమొక
ఆట వాళ్ళకి నేరిపితే వాళ్ళకి తెలిసిన పాట ఒకటి వాళ్ళు మాకు నేర్పేవారు. అలా నేర్పిన
వాటిల్లో ఒకటి " డీబ్ డీబ్ డీబ్, మై బ్లూ షీప్, సెల్లికింద వాటర్, లక్క కప్ప సాసర్..
డీబ్ డీబ్ డీబ్.. " ఇలాంటి అంగ్రేజీ పదాలు లేవనే వాడు మా సీనన్న. చాలా పెద్దయ్యాక
దాని అసలు స్వరూపం తెలిసి పడీ పడీ నవ్వుకున్నాము. Deep deep deep, My blue ship,
Sailing in the water, like a cup and saucer , deep deep deep!!
సరే సరే
3 ఉయ్యాలలు నిండాయి రండి మళ్ళీ లేట్ అయిపోతుంది. మూడు ఉయ్యాలలు నిండే వరకు అందులో అప్పటికే
ఎక్కి కూర్చున్న అందరికీ ఎక్కడ లేని ఓర్పు...ఆ తర్వాత, పైన ఉయ్యాల వాళ్ళకి కంగారు.
" ఇగ కానీ భాయ్, పోవాల" అంటూ ఉండేవారు. కానీ నాలుగు ఉయ్యాలలు నిండకపోతే బ్యాలన్స్
అవదనుకుంటా!! అప్పటికి రీజన్లు లాజిక్లూ తెలియవు...ఓన్లీ గోల్ ఈస్ ..మూడు ఉయ్యాలలు
నిండే టైముకి అక్కడ ఉండాలి అంతే! నాలుగో ఉయ్యాలలో
ఎక్కమని అక్కడ నిలబడ్డ పిల్లా పిచుకల్ని అడుగుతాడు. మనం అప్పుడు "పైసల్లేవన్నా"
అనాలి. "పైసలడిగినాన్ చెల్లే, రాండ్రి" అంటాడతను. "అమ్మో నాకు భయ్యం, నేను రాను " అనాలన్నమాట.
అతను..."రాండ్రి తల్లీ! మా అమ్మలు
గదూ, జోర్గ తిప్పనులే" అని సముదాయించి , బతిమాలి మరీ ఫ్రీగా ఫ్రీగా ఎక్కించడమే
కాక, గావురంగ అలగ్గున ఎత్తుకుని కూచోబెడతాడు కూడా.. "పూకట్ కి వచ్చేటివన్న సరే
, ఇజ్జత్ తోని తీస్కోవాలె" అన్నది మా రూలు.
జాతర 20 రోజుల్లో రెండు సార్లన్నా వచ్చేది చాన్స్. ఇంక ఉయ్యాల ఎక్కగానే కీకలు
పెట్టుకుంటూ, భయపడుతూ, కడుపులో తిప్పుతున్నా ఉగ్గబట్టుకుంటూ..అదే మజా. ఇలాంటి భయాన్ని
మీతో పంచుకోవాలని ఉంది.
అంటే మిమ్మల్ని భయపెట్టడమే నా లక్ష్యం అనుకుంటారేమో...ఛ్చ ఛ..నేనలాంటి
దాన్ని కాదండీ. ...నేను సెల్ఫు లెస్సు..."మంచివేమన్నుంటె మందితోని పంచుకోవాల"ని
అమ్మ చెప్పేది. మరి అన్నీ పంచుకోవడం కుదరదు కాబట్టీ, అప్పుడప్పుడు ఇలాంటి భయమనే మంచి వస్తువుని అందరితో పంచుకుని, తుఛ్చమయిన డబ్బునీ,
సుఖాన్నీ, బంగారాన్నీ, నేనే కష్ట పడి భరిస్తూ ఉంటాను..
సంతోషంగా జరిగిపోతున్న అల్వాల్ జీవితాల్లో ఒక పెద్ద ఉపద్రవం
వచ్చి పడింది. దాని కథా కమామీషూ ఏంటంటే, వెంకన్న
గుడి పక్కనున్న జగన్నాధ స్వామి గుడిలో పూజారులు కాపురముండే వారు. పూరీ నించి వచ్చిన
వాళ్ళనుకుంటా హిందీ లాంటి భాష మాట్లాడేవారు. ఒక్క కుటుంబం మాత్రమే తెలుగు వారు . ఒక
తండ్రి, ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. ఆ అమ్మాయిలిద్దరి పేర్లు ఉమ, ఉష. వాళ్ళిద్దరూ
గుడికి వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరించే
వారు . ఇద్దరికీ వయసులో రెండు మూడేళ్ళూ తేడాయే
అయినా, ఉమక్క ఉషక్కని తల్లిలా చూసుకుంటుందని అందరూ చెప్పుకునే వారు. మరి ఏం జరిగిందో.
ఒక రోజు ఉమక్క, ఉషక్కని రోజూ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుందిట. జడలు వేసి, అన్నం పెట్టి, ఒళ్లో కూడా కుర్చోపెట్టుకుందిట (ఉషక్క మరీ చిన్న
పిల్ల కాదు పదహారేళ్ళు ఉంటాయేమో అప్పటికి ). సాయంత్రం అయ్యేటప్పటికి ఉమక్క నిప్పు అంటించుకుందని
ఊరిలో వార్త! మా ఊర్లో దవాఖానాలు లేవు కాబట్టి గాంధి ఆస్పతాల్ కి తోల్కబొయ్యి, మర్నాడు
హాస్పటల్ నించి శవాన్ని మాత్రమే తీసుకురాగలిగారు.
ఆ అమ్మాయి అంత్య క్రియలు మా ఇంటి దగ్గర చెరువు పక్కన ఉన్న స్మశానంలో
చేసారు. అసలు మా ఇంటి వెనక వైపు బొందల గడ్డ, చెరువు ఉండడం వల్ల చావులన్నీ మా ఇంటి ముందు
నించే వెళ్ళేవి. డప్పు, డ్యాన్స్ లతో , గులాల్ చల్లుకుంటూ, పండుగాలా తీసుకెళ్ళేవారు
కానీ, ఆ డప్పు మోతకి గుండెల్లో దగడు పుట్టేది. ఏదైనా చావు అయిందంటే, మాకు కొన్ని రోజుల వరకూ చెరువు గట్టు వయిపు ఆటలు
బంద్. నాలుగు రోజులు అందరి నోట్లో ఇవే కబుర్లు. రాను రాను ఎలా కాలిపోయిందని టాపిక్
మారిపోయి, ఎందుకు కాల్చుకుని ఉంటుందీ అని స్టార్ట్ అయ్యింది. చిలవలు పలవలుగా ఏవేవో
చెప్పుకున్నారు. చిన్నతనం వల్ల నాకు ఒక్క ముక్క కుడా అర్థం అయ్యేది కాదు, కానీ సీరియస్
మ్యాటర్ ఏదో ఉందని మాత్రం అర్థం అయ్యేది. మా ఊళ్ళో అందరూ డిటెక్టివులయ్యారు.
పదకొండో రోజు కర్మ కాండలు అవ్వగానే ఇంకొక న్యూసు, ఉమక్క దయ్యమయిందని...!!
ఇంకేముందీ అందరూ చీకటి పడే వేళకి ఇంటికెళ్ళి పోవాలని రూల్ పాస్ చేసేసారు. పెద్దా, చిన్నా
అని లేకుండా అందరికీ భయమే. భయమేమో గానీ ఊరికి ఒక డిసిప్లిన్ వచ్చింది. నా లాగా చదువు
సంధ్య లేకుండా తారాడే పిల్లలందరూ ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకోవడం మొదలెట్టారు. సారా
దుక్నం చెరువు గట్టు చివరన ఉండటం చేత గవుండ్లోల్ల
'గుడుంబా శంకరన్న' కూడా చీకటి పడే సమయానికి 'ఖేల్ ఖతం దుక్నం బంద్' అనేసాడు కాబట్టి మందు బాబులు మాపటి కల్లా ఇంటికొచ్చేయ్యడం మొదలెట్టారు. కొంత
మంది మాత్రం “దెయ్యం గియ్యం జాన్తా నై “ అని గోల్నాకా రోడ్డు మీదున్న మందు కొట్లో మందు(???)
కొనుక్కుని " భయమా బుగులా, బాయిల బడితే లోతా, ఈతపల్లి సాటా, తుర్క పల్లి గేటా"
అని షంగలిచ్చుకుంట,లేట్ గా రావడం మొదలెట్టారు.
అలా రాత్రిళ్ళు తిరగడానికి ట్రయి చేసిన వాళ్ళందరూ దయ్యాన్ని చూసామని, ఎవరో అమ్మాయి
తల మీద కుంపటి పెట్టుకుని వీధుల్లో తిరుగుతోందని చలీ జ్వరం తెచ్చేసుకుని మంచమేక్కేసారు.
భూత వైద్యుడొకడు " దయ్యాన్ని పట్టి సీసాలో బంధించి, బొందలగడ్డ దగ్గర పాతి పెట్టాన”ని
చెప్పి, పైసల్ వసూల్ చేసాడు కానీ, మా ఊరిని దయ్యం వదల్లేదు. స్వామీజీ ఒకరు “దయ్యం మన జోలికి రాకుండా ఉండాలంటే
ఇంటి ఆడ వాళ్ళందరూ ఆకు పచ్చటి గాజులు ధరించాల”ని చెప్పి, మా గాజుల కిష్టయ్యకి గిరాకీ పెంచాడు. గాజుల కిష్టయ్య చిన్న
పిల్లలకి ఆకుపచ్చని లబ్బరు గాజులు తేవడంతో, మా అమ్మ మా నలుగురికీ కూడా చేతుల నిండా పచ్చ గాజులు వేయించి
ఎప్పటి నుండో నాకు తీరని కోరికని తీర్చేసింది. ఇంక దర్గా దగ్గర ఒకటే సందడి. మా ఖాన్
సాహేబు మామ చారానా తీసుకుని తాయెత్తు లిచ్చేవాడు. ఉమక్క పుణ్యమాని వాళ్ళింట్లో కొన్ని
రోజులకు సరిపడా కాసుల గల గల.
ఈ దయ్యం గోల కాదు గానీ, 5 దాటాక ఎవ్వరూ ఇల్లు కదలకూడదు కాబట్టి,
నాయసుంటి పిల్లలకి పెద్ద కష్టమే వచ్చ్హి పడింది. మాకు ప్రతి సాయంత్రం చాలా ఇంపార్టెంట్
మీటింగులు ఉండేవి. సోమవారం మీటింగు ప్రతాప్ రెడ్డి సారి ఇంటి కాడ. పిల్లల్లేని ప్రతపరెడ్డి
సారు ప్రతి సోమవారం పిల్లలందరికీ పిప్పరమెంట్లు పంచేవారు...సో, మండే సాయంత్రం అక్కడ
హాజరు. అప్పట్లో మా ఊర్లో అతి పెద్ద ధనికులు గుట్టమీది రామిరెడ్డి తాత. వాళ్ళకి చాలా
పొలాలు అవీ ఉన్నాయి... వాళ్ళు ప్రతి శుక్రవారం గుడాలు (గుగ్గిళ్ళూ) ఉడికించి, దేవునికి
సమర్పించి, పిల్లలందరికీ పంచేవారు....ఫ్రయిడే సాయంత్రం నుంచీ అక్కడే మకాం... మరి లలితత్తమ్మ రెండు చేతులూ పట్టమని, పట్టినన్ని గుడాలు పెట్టేది.
అప్పుడప్పుడు గౌను పట్టమని ఒడి నిండా పోసేది. అక్కడే అందరం గోడ పక్కన మోరీ దగ్గర కూచుని
మట్టి చేతులు అవీ ఇవీ ఆలోచించకుండా బొజ్జ నిండా తినేవాళ్ళం. నాకొక్కదానికీ ప్రతి సాయంత్రం
ప్రత్యేకమైన మీటింగ్ ఇంకోటి ఉండేది. మా గొల్లోళ్ళ అన్నదమ్ములవి పది కుటుంబాలు కలిసి
ఒకే లోగిల్లో ఉండేవి. బావలు మరుదులు, మామలు ఉంటారు కాబట్టి, మగ పిల్లలకి పెళ్ళిళ్ళు
అయితే, కొత్త కోడళ్ళు కొన్నాళ్ళు బయటికి రారు. రామచందరన్నకి పెళ్ళయ్యింది. రాంచందర్ అన్నకి వదిన మీద జాలి వేసేదేమో..లోపల ఒక్క దానికే బోర్ కొడుతుందని...నన్ను పిలిచి..' ఒదిన తోని మాట్లాడు
పో చెల్లె 'అని పంపించేవాడు...నేను చాల గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని... వదిన మారెడ్పల్లి
అనే పెద్ద సిటీ నించి వచ్చిందని అందరూ చెప్పుకునేవారు...చేతికి
దండ కడియాలు , చెవులకి మకర కుందనాలు, కాళ్ళకి
మెరిసి పోతున్న పట్ట గొలుసులు పెట్టుకున్న
ఆమె అంటే నాకు హీరోఇన్ లెక్క. వదినకి నేను పెద్ద కాలక్షేపం బఠానీ. స్కూల్ నించి వచ్చాక
సాయంత్రం వరకూ కూచోపెట్టుకుని పాటలు పాడించుకునీ, పద్యాలు చదివించుకునీ, అందరి గురించీ
అమాయకంగా నేను చెప్పేవన్నీ ఇంటరెస్టుగా విని పెట్టడమే కాక, వాళ్ళ పుట్టింటినుంచి తెచ్చిన
మురుకులు, గర్జలూ, ఓడప్పలూ నాకు తినడానికి పెట్టేది. వదిన దగ్గర నించి నేను బయటికి
వచ్చాక అందరికీ నన్ను చూసి అడ్మిరేషన్..నేను "హేమా మాలిని " దగ్గర నించో
“రేఖ” దగ్గర నించో వచ్చినట్టు! అదే కదా మనకు కావలసిన ఫీలింగ్. ఇంక ఇంకో తప్పని సరి
సాయన్ కాలం మీటింగ్ పంచాయతీ ఆఫీస్ దగ్గర. మా గోపాల్ సేట్ దుక్నం ...సాయంత్రం అవ్వంగానే
లైట్ వేసి పిల్లలందరికీ పిలిచి బెల్లం ముక్కలు పెడతాడు. మధ్యాహ్నమనగా అమ్మగానీ, పక్కింటి అత్తమ్మ గానీ
ఉప్పు , చాక్పత్తీ , కాఫీ బిళ్ళలూ ఏమి
తెమ్మన్నా సరే, అప్పడి దాకా లేట్ చేసి ఆ సమయానికి
వెళ్ళచ్చు....అవేమీ లేకపోతే కనీసం పంచాయతీ ఆఫీసు వాళ్ళు పొలం పనులు, వార్తలు వేస్తారు
కదా, మాస్టారు గారు విని రమ్మన్నారు అని చెప్పగానే , మా అమ్మ నేను గోల్డ్ మెడలు తెచ్చుకున్నట్టో,
అదేదో ఎవరెస్టు శిఖరము ఎక్కినట్టో సంతోష పడిపోయి, "పొయిరా బిడ్డా" అని ముద్దు
పెట్టి మరీ పంపేది. గోపాల్ శేట్ కూడా చీకటి పడకుండానే కొట్టు కట్టేస్తాడు కాబట్టి, కొనే వస్తువులేవో అందరూ ఆరు లోపే కోనేసుకుంటున్నారు.
ఇవన్నీ లేకుండా జీవితం ఎలా అని తలచుకుంటున్నాకొద్దీ
మాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. వీటన్నిటికీ తోడు సాయంత్రం అవగానే మంగళవారాలు
పెద్ద ఐసు ముక్క బండి మీద పెట్టుకుని దాన్ని చిద్రిక/దూగడ పట్టి , పుల్లకి పెట్టి ఎర్ర
రంగు చల్లి ఇచ్చే బర్ఫ్ బండి రావట్లేదు. దోమ రక్తం పీల్చినట్టు, బర్ఫ్ మీద రంగు గబా
గబా పీల్చేసి 'అన్నా కొంచెం రంగేయ్యవా' అంటూ, మన పుల్లకున్న ఐసు అయిపోయేవరకు ఆ బండితో ఎంత
దూరమయినా ప్రయాణించటం, తరవాత పరిగెత్తుకొంటూ
ఇంటికి రావడం ఎంత బాగుంటుందనీ. ఎప్పటికో ఈ దయ్యం నించి విముక్తి !
ఎవరో ఇంకొక ఊరికి వెళ్ళొచ్చి “అక్కడ కూడా ఇలాంటి దయ్యం ఉండేదనీ,
తలుపుల మీద 'ఓ స్త్రీ రేపు రా’ అని వ్రాస్తే,
ఎడ్యు కేటేడ్ దయ్యం అది చదివి' అయ్యో ఇవాళ మనని రమ్మని అనలేదు కదా రేపు వద్దాం
లే' అని ప్రతి రోజూ అనుకుందనీ, అలా రోజూ చూసీ చూసీ, ‘ఛీ ఈ ఊర్లో అందరూ నన్ను రేపు రమ్మంటారు ఒక్కళ్ళు కుడా నన్ను రమ్మనట్లేదు’
అని విసుక్కుని, ఫీల్ అయ్యి, ఊరు వదిలి పోయిందిట”
అని చెప్పారు. ఇది బాగా నచ్చి ఊళ్ళో వాళ్ళందరూ అందరూ ఇంక తలుపుల మీద 'ఓ స్త్రీ
రేపు రా' అని పసుపు తోనూ, కుంకుమ తోను, ఇంకా
థిక్ గా బొగ్గు, సున్నం తోనూ రాసి పడేసారు.
ఇంకా కొంచెం మీరిన వాళ్ళు కోడినో, యాటనో ఏసేసి, ఆ నెత్తురుతో ప్రేమలేఖ వ్రాసినట్టు
"ఓ స్త్రీ రేపు రా" అని వ్రాసేసి, అదే నెత్తురులో చేతులు ముంచి, తలుపుల మీదా,
గోడల మీదా, ఇంకా ఇంటికి అన్ని వైపులా పంజాలు కొట్టి, పకడ్బందీ చేసుకున్నారు. ఆ పదం
చూస్తే నాకు భయం.
మా ఇంట్లో జమా జెట్టీ ల్లాంటి ముగ్గురు మగ పిల్లలున్నారని తలచి అమ్మ “మనింటి పయిన
అక్కర్లేదులే” అనేసింది. (మీరేదో సుమో రేజ్లిలర్లని ఊహించేసుకుంటారేమో! మా అన్నలు ముగ్గురూ
పిచ్చిక పిల్లల్లా ఉండేవారు.. అంతా మా మాతా శ్రీ భ్రమ)..... హమ్మయ్య బతికి పోయాను,
లేక పొతే ఇల్లొదిలి బొందల గడ్డ మీద ఉండేదాన్నేమో!
ఓ స్త్రీ రేపు రా అనే ఆ పదం అంటే నాకు చాలా భయం పట్టింది ఎందుకో ! తెలిసీ తెలియకా, బొందల గడ్డ మీద చాలా సార్లే వెళ్ళి
ఆడుకున్నాము కదా మరి. అందుకే అదంటే భయం లేదన్నమాట. బాగా భయపడుతున్నామని మా నాన్న నన్ను , చెల్లినీ
పక్కలో పడుకో బెట్టుకుని 'రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యః పఠేన్నిత్యం
దుస్స్వప్నం తస్య నస్యతే ' అని వల్లె వేయించి, " మన ఇంటికి దయ్యాలు గియ్యాలు ఏమీ
రావు గాక రావు, పీడ కలలు కూడా రావు హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు" అని ధైర్యం
చెప్పేవారు. ఒక ఎండా కాలం , ఒక వానాకాలం
గడిచాక కొన్ని నెలలకి వర్షం వల్లనో, కాలం వల్లనో
కానీ నెమ్మదిగా ఉమక్క దయ్యం తలపులతో పాటు, తలుపులపైన ఉన్న ' 'ఓ స్త్రీ రేపు రా" కూడా కరగిపోయింది.
మళ్ళీ చీకటి పడ్డాక కూడా మా ఊర్లో సందడి మొదలయ్యింది....
సడన్ గా ఒక రాత్రి బస్సు దిగి ఇంటికొస్తున్న విమలక్కని పోలీసు
స్టేషన్ దగ్గర ఎవరో గట్టిగా పట్టుకుని మెడలో గొలుసు కత్తిరించుకుపోయారు. దొంగలో, దయ్యమో
తెలియ లేదు కానీ , ఆ అమ్మాయి నెల రోజులు మంచం దిగలేదు. దడుసుకుందనీ, దిష్టి తగిలిందనీ,
దయ్యం పట్టిందనీ నానా విధములయిన దిష్టి మంత్రాలు, దిగదుడుపులూ , పూజలు అన్నీ జరిగాయి...అందరూ బంగారు గొలుసులు మానేసి (నిజ్జం
బంగారమనుకునేరు..మాకెవ్వరికీ అంత సీను లేదు. మా గాజుల కిస్టయ్య ఇరవై పైసల నాణాలతో చేయించిన గొలుసులేవో అమ్మేవాడు...మా దగ్గర ఉన్న
అత్యంత ధనవంతులు అవి కొనుక్కునేవారు...)ఏవో వెండి రంగు నగలేసుకోవడం మొదలెట్టారు...మళ్ళీ
ఊరంతా గప్ చుప్ అయిపోయింది...రాత్రిళ్ళు తలుపులు చప్పుళ్ళయేవి...యెవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం..ఎప్పుడు తెల్లారుతుందా
అని ఒకటే ఎదురు చూపు.
పనిలో పనిగా నాలుగు రోడ్లు కలిసిన చిన్న చిన్న కూడళ్ళలో నిమ్మకాయలు,
పసుపు కుంకుమలు దర్శనమిచ్చేవి. అలాంటివి కనిపిస్తే వాటి వయిపు చూడకుండా, తొక్కకుండా,
దాటకుండా వెళ్ళాలని అమ్మ చెప్పేది...దాంతో దూరంగా ఏ వస్తువు కనిపించినా, కొంచెం దూరం కళ్ళు మూసుకుని మనసులో జామెట్రీ లెక్కలు
వేసుకుని, ఊహా పటం మ్యాప్ గీసుకుని, తొక్కకుండా, దాటకుండా, చూడకుండా అని అమ్మ చెప్పిన
రూల్సు తూ. చా. తప్పకుండా పాటించేవాళ్ళం. ఇంక దార్లో ఎర్రగా పచ్చగా ఏం కనిపించినా భయమే...ఎవరిదో
ఒక సారి ఎర్ర రుమాలు పడిపోయింది రోడ్డు మీద..అప్పుడు కుడా 'తొక్కకుండా, దాటకుండా, చూడకుండా' రూలుతో బాటు మా జామెట్రీ పనికొచ్చింది మరి. అలా ప్రాక్టిస్
అవ్వడం వల్లనేనేమో, నేను ఇప్పటికీ
నిద్రలో ఎక్కడికయినా నడిచి వెళ్లి మళ్ళీ కరెక్టుగా ఇంటికి ఒచ్చేస్తున్నానని మా సీతయ్య
తిడుతుంటే, ఇదేంటి ఇంత మంచి విషయానికి మెచ్చుకోరు! నిజానికి ఇంటర్ నేషనల్ లెవెల్
లో ఉండాలి నేను అని ఫీల్ అయ్యాను కూడా.
ఇంకొద్ది రోజులవగానే సత్యా థియేటర్ వెనుక ఉన్న ఖాళీ మైదానంలో
తల లేని మొండెములు తిరుగుతున్నాయని వార్త. అప్పట్లో ఊర్లోకి బస్సులు లేవు. మెయిన్ రోడ్డు
మీద బస్సు దిగి, చింత చెట్ల కింద నించి నడిచి
రావాల్సి వచ్చేది...సో అందరికీ భయమే. లేట్ రాత్రిళ్ళు బస్సులు ఆపెస్కోవాల్సి వచ్చింది
ఆర్టీసీకి. ఒకళ్ళు చూసామంటే, ఇంకొకళ్ళు వాళ్ళని వెంటాడిందని చెప్పుకునేవారు. ఎవ్వరికీ
మొహం కనిపించలేదుట గానీ, పెద్ద పెద్ద గోళ్ళు చూసారుట. మొండెం డ్యాన్సు చేస్తూ వస్తుందిట
వెంట .( మీరు అనుమానించకండి...అప్పటికి ఇంకా
ప్రభు దేవా చేసిన ముక్కాలా డాన్సు రాలేదు
). ఎవ్వరు దొరికినా పట్టి రక్తం తాగేస్తుందని చెప్పుకున్నారు. (నోరు లేనిదే తాగటం ఏంటో
..పాపం మనం నమ్మేద్దాం లెండి ఈ సారికి) . కొందరు
నాస్తికులు మాత్రం ఇది దొంగల పనే అని పోలీసు స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు. కానీ ఈ
కేసులో పోలీసులు కూడా భయ పడి పోయారు. (వీళ్ళు
భయపడ కూడదని సెక్షన్లు ఏమీ లేవుగా )మళ్ళీ మా ఊర్లో డిసిప్లిన్ తో పాటు 'ఓ స్త్రీ రేపు
రా" రిపీటు....
యీ భయాలన్నిటితో పాటు...మా ఇంటి దగ్గరే పంచాయతీ ఆఫీసు. మా ఆండాళ్
వాళ్ళ నాన్న అక్కడ పని చేసేవారు. ఆది వారాలు మాత్రం మాకు ఆ ఆఫీసంతా ఆట స్థలమే. తలుపులు
తియ్యకూడదు ,లయిట్లు వెయ్యకూడదు కొంచెం చీకట్లోనే దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. సరదాగా
టయిపు మిషన్లని టక టక లాడించడం, టీచర్ల ఆట...ఆఫీసు ఆట ఆడుకునే వాళ్ళం కాబట్టి ఆ చీకటికి భయం వేసినా వెళ్ళే
వాళ్ళం. కానీ అందరం గప్ చుప్ గా దాక్కున్నప్పుడు
సడన్ గా ఫ్యాక్స్ మిషను వింత శబ్దం చేసేది.
ఉలిక్కి పడేవాళ్ళం. చీకట్లో ఆ శబ్దం వచ్చినప్పుడెవరో.. “అగో ఉమక్క వచ్చింది” అని అరిచారు.
అప్పటి నించీ ఆ శబ్దమంటే భయం పట్టింది. చూసారా
అన్ని శబ్దాలూ ఫ్యాషన్ గా మారాయి కానీ నా దురదృష్టం కొద్దీ ఫ్యాక్సు మిషన్లు ఇప్పటికి కూడా కీచుమని అదే శబ్దం
చేస్తాయి..నవ్వుకోకండి కానీ ఇప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యాక్సు వచ్చిందంటే
మాత్రం నా గుండె గుభేల్... ....
కొన్నేళ్ళయ్యాక నేను కెనడా వచ్చా. సప్త సముద్రాలు దాటి వచ్చా
కదా, అల్వాల్ దెయ్యం నాకేం భయ్యం అనుకున్నా కానీ, మా దగ్గర ఒక సామెత ఉంది లెండి. గాచారం
బాలేక నాచారమొస్తె, నాచారం దయ్యాలు నా ఎంట బడ్డయన్నట్టు, ఆరు నెలల క్రితం సెయింట్ కాథరిన్స్
అనే ఊర్లో ఒక రేడియో టేషన్లో కొన్ని నెలల కోసం కొలువుకి కుదిరా. చాలా పెద్ద
అందమయిన పురాతన భవనం ఇది. దీన్ని ముద్దుగా
వైట్ హౌస్ అని పిలుచుకుంటారు. ఇది ఒక హాంటెడ్
హౌసుట. ఒక సామంత రాజు యీ భవనంలో ఉండేవాడట.
ఈ భవనం బేస్మెంట్ లో అమెరికా నించి ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం నించి బానిసలని అమెరికా
నించి కెనడా కి తీసుకుని వచ్చేవారుట. అలా వచ్చిన ఒక బానిస (బెట్టీ) నివాసముండడానికి
భవనం టాప్ ఫ్లోర్ లో అటక మీద అపార్ట్మెంట్
(ఆటిక్ అపార్ట్మెంట్ అంటారు) ఇచ్చారుట. ఆమె ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియదు కానీ కుటుంబంతో
సహా దయ్యాలయిపోయారుట అందరూ. మిగిలిన దయ్యాలు ఎక్కడికి పోయాయో కానీ, బెట్టీ దయ్యం మాత్రం
ఈ భవనంలో తిరుగుతూ ఉంటుందని చెప్పుకుంటారు. రేడియో వాళ్ళు ఈ భవనం కొన్న కొత్తల్లో,
మా జెనరల్ మ్యానేజర్ ని ఎవరో మెట్ల పైనుండి తోసేసినట్టు అనిపించిందిట చాలా సార్లు.
అలాగే రేడియోలో ఒక ప్రోగ్రాం వేద్దామనుకుంటే, ఇంకొకటి రావడం.. రేడియో కాసేపు మూగబోవటం
అవీ జరిగి, జనాలు ఎవ్వరూ పని చెయ్యడానికి ఒప్పుకోలేదుట. అందుకే మ్యానేజర్ గారు, బ్లాక్ మ్యాజిక్ వాళ్ళనీ
ఇంకా ఏవో క్షుద్ర పూజలు చేసే వాళ్ళనీ పిలిచి పూజలు చేయించిదిట. ఇప్పటికి కూడా ఇంకా
నెల నెలా ఏవో పూజలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని లెక్కల్లో ఎక్కించమంటుంది నన్ను. “దయ్యాల
లెక్కలో వెయ్యమంటారా” అనడుతాను కొంటెగా. “వద్దులే హెడ్ ఆఫీసు వాళ్ళు చూస్తే బాగోదు,
రెపెయిర్ చేయించామని వ్రాయి” అనేవారు.
ప్రస్తుతం నా ఆఫీసులో
ఫయిలింగ్ కాబినెట్ అరలు కొంచెం లూసుగా ఉండి ఆటోమేటిగ్గా ఓపెన్ అవుతాయి ఒక్కొక్క సారి.
ఆ సమయంలో ఎవరయినా నా ఆఫీసులో ఉంటే 'బెట్టీ
గో అవే ' అని జోక్ చేస్తారు. ఇంక ఆఫీసులో కంప్యూటర్లు పని చెయ్యక పోయినా , తలుపులు
గాలికి ధడేల్మని మూసుకున్నా , డెస్క్ మీద ఏమైనా ఒలికినా ..ఇది బెట్టీ పనే అని అనేస్తారంతా.
నా ఆఫీసు ముందే బెట్టీ గది ఉన్న అటక మీదకి
మెట్లు. బెట్టీ గనక కిందికి దిగితే మొదట నా ఆఫీసే కనబడుతుంది. అందరూ ఐదింటికల్లా వెళ్ళిపోతారు.
నేను అక్కవుంటెంట్ ని కనక, నెలలో రెండు మూడు రోజులు మంత్
ఎండ్ కి అన్ని బ్రాంచ్ ల నించీ వచ్చిన రిపోర్టులు హెడ్ ఆఫీస్ కి పంపించే దాకా ఉండాల్సి
వస్తుంది. ఒకో సారి 12 అవుతుంది రాత్రి. చుట్టూ కిటికీ లోంచి చిక్కటి చీకటి. ఇంకొక
వైపు బెట్టీ కిందకి దిగుతుందేమో అని భయం. ఒక్కదాన్నీ ఈ ఫ్లోర్ లో పని చెయ్యాలి. బేస్మెంటులో
ఇద్దరు అనౌసర్లు పని చేస్తారు ఎనిమిది వరకు
. అంతకు తప్ప ఎవ్వరూ ఉండరు. మొదట్లో భయం లేకుండా
బాగానే పని చేసా. కానీ ఒక రోజు ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఈ ఫ్యాక్స్ మెషిను కీచుమని అరుపులు.
దాంతో చిన్నప్పుడు పంచాయత్ ఆఫీసులో ఉమక్క వచ్చిందని ఎవరో అరిచిన అరుపు గుర్తొచ్చి గుండెల్లో
దగడు పెట్టింది. పోనీ పని వదిలి వెళ్ళలేను డెడ్ లైన్స్ ఉంటాయి మరి. ఈ మధ్య క్లీనర్ని
అప్పాయింటు చేసాము. "పగలు అందరికీ ఇబ్బంది కదా సాయంత్రం వస్తావా" అని అడిగాను
ఇంటర్ వ్యూ చేస్తున్నప్పుడు. ఆ పిల్లోడు సంతోషంగా "పగలు కాలేజీకి వెళ్ళాలి, సాయంత్రమయితే
ఒకే" అనేసాడు. రోజూ క్లీనర్ అబ్బాయిని "కొంచెం నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పవా" అనిబతిమాలుకుంటాను.
అప్పటి దాకా ఆ పిల్లాడు చేసే చీపురు చప్పుళ్ళు , నీళ్ళ చప్పుళ్ళు, వ్యాక్యూం చప్పుళ్ళు విని ఢైర్యంగా పని చేసుకుంటాను. ...ఆ
పిల్లాడు వెళుతున్నానని చెప్పగానే, ఎంత పని ఉన్నా నేను కూడా బిల్డింగ్ లోంచి జంపు.
(అయ్యో ఆత్మ హత్య కాదండీ ..తొందరగా బయట పడతానూ అని).
ఈ మధ్య ఆ పిల్లాడూ మానేసాడు. పగలు పని చేసి పోతున్నాడు కొత్త
క్లీనరు. ఇక్కడ ఒక్క దాన్నీ కూచునప్పుడు, " నా వెనక ఎవ్వరో నడచినట్టుంటాది"
అనీ, " నిను వీడని నీడను నేనే" అనీ వినిపిస్తున్నట్టు అనిపిస్తోంది. అదీ
కాక మరి ఎలకలున్నాయో, పిల్లులున్నాయో కానీ బేస్మెంట్ లోంచి కొన్ని శబ్దాలు. ఒక్కో రోజు
గుండె ఆగిపోతోందంటే నమ్మండి. అక్కడికీ హనుమాన్ చాలీసా చదువుకుంటున్నా, గుళ్ళో తాయెత్తు కూడా కట్టించుకున్నా.
ఉద్యోగం చాలా అవసరం కాబట్టి మానలేను, పోనీ ఇంటికి తొందరగా వెళ్ళలేను,
ఈ భయం తట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుంటే, ' ఓ
స్త్రీ రేపు రా' గుర్తొచ్చింది. మా
బెట్టీ అల్లరి రోజు రోజుకీ ఎక్కువయిపోతోంది. అంతెందుకు ఈ కథ రాసానా, మొత్తం రాసాక సేవు
చేసిన టపా మొత్తం ఎగిరి పోయింది. ఇది బెట్టీ పనే అని నాకు అనిపిస్తోంది. ఇంకో మంత్
ఎండ్ వస్తోంది. తలచుకుంటేనే గుండె గాభరా పెట్టేస్తోంది. మరి నా ఆఫీస్ తలుపు మీద ' ఓ స్త్రీ
రేపు రా' అని రాద్దామని డిసయిడు అయ్యా! కానీ బెట్టీకి మన భాష రాదుగా?
"పోనీ ఓ ఉమన్ కం టుమారో అని వ్రాద్దామా?"
ఏదో ఒకటి చెప్పి పుణ్యం కట్టుకోరాదురి!!!